మాస్ మహారాజా రవితేజ డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కీర్తిసురేష్, అక్షయ్కుమార్ తరహాలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఈ ఇద్దరి తరహాలోనే ఓటీటీకి సై అంటున్నారట. కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. మరో చిత్రం `మిస్ ఇండియా` రిలీజ్కి రెడీ అవుతోంది. ఇదే తరహాలో అక్షయ్ కుమార్ నటించిన `లక్ష్మీబాంబ్` కూడా ఓటీటీ బాటపట్టిన విషయం తెలిసిందే.
వీరిలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఓటీటీకి సై అంటున్నారట. రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని రవితేజ నిర్మాతకు క్లియర్గా చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మేలోనే రిలీజ్ చేయాల్సింది. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. పలు ఓటీటీ కంపనీలు ఆఫర్ ఇచ్చినా మేకర్స్ అందుకు ససేమిరా అంటున్నారు.
అయితే రవితేజ తాజా నిర్ణయంతో మేకర్స్లో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఓ ఓటీటీ సంస్థతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. బడ్జెట్కు తగ్గ ఆఫర్ లభిస్తే `క్రాక్` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇటీవలే టాక్స్ మొదలు పెట్టారట. అవి కొలిక్కి వస్తే ఓటీటీలో లేదంటే థియేటర్స్ రీఓపెన్ అయ్యే వరకు వేచి చూడక తప్పదు.