`బలుపు` ఫేమ్ గోపీచంద్ మలినేని కొంత విరామం తరువాత చేస్తున్న చిత్రం `క్రాక్`. మాస్ మహారాజా రవితేజ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ మారింది. రిలీజ్ డేట్ మారింది. ఇందులో లేడీ విలన్గా వరలక్ష్మి శరత్కుమార్ నటిస్తోంది. నెల్లూరి పరిసర ప్రాంతాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత రవితేజ మరో భారీ చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. ఏ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రమేష్ వర్మ దర్శకుడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు.
అయితే ఈ సినిమాపై ఆ రూమర్ రావడానికి అసలు కారణం వేరే వుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా తమన్ కావాలని హీరో రవితేజ, వద్దు దేవిశ్రీప్రాద్ మాత్రమే కావాలని దర్శకుడు రమేష్ వర్మ పట్టుబట్టారట. దీంతో వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, ఆ కారణంగానే ఈ సినిమాపై వరుస కథనాలు వినిపించాయని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ వివాదానికి నిర్మాత పుల్స్టాప్ పెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చారని తాజా సమాచారం.