క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రష్మిక మందన్న అఫీషియల్గా అనౌన్స్ చేసి షాకిచ్చింది. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా వరుస బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక సిద్ధార్ధ్ మల్హోత్రా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఈ విషయాన్ని బుధవారం రష్మిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా తను బాలీవుడ్కు పరిచయం అవుతున్న చిత్ర పోస్టర్ని షేర్ చేసింది. రష్మిక బాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం అవుతున్న చిత్రం `మిషన్ మజ్ను`. శంతను బగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూ వాలా, అమర్ బూటాల గరిమ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాకిస్థాన్లో ఇండియా అత్యంత రహస్యంగా జరిపిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓ విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కించబోతున్నారు. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో బన్నీతో కలిసి `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.