వరుస విజయాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. `గీత గోవిందం` సక్సెస్ తరువాత కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రోహిత్ షెట్టీతో జరిగిన ఎంగేజ్మెంట్ని రద్దు చేసుకోవడంతో కన్నడ ప్రేక్షకుల్లో ఓ వర్గానికి టార్గెట్గా మారింది. దీంతో రష్మిక సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా ట్రోలింగ్స్ షరా మామూలే అయిపోయింది. తాజాగా తెలుగులోనూ అదే తరహా పరిస్థిని ఎదుర్కొంటోంది. రష్మిక నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. మహేష్తో తొలిసారి కలిసి నటిస్తోంది. ఇంత క్రేజీ ఆఫర్ని చాలా తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల ఓ ఆంగ్ల మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ డ్యాన్స్ గురించి మాట్లాడి అడ్డంగా దొరికిపోయింది.
దీంతో మహేష్ ఫ్యాన్స్ రష్మికని సోషల్ మీడియాలో ఆడుకోవడం మొదలుపెట్టారు. టంగ్ స్లిప్పయ్యానని అర్థం చేసుకున్న రష్మిక జరిగిన పొరపాటును సరిదిద్దుకునే పనిలో పడింది. ఇందు కోసం మహేష్ ఫ్యాన్స్ని కూల్ చేయడం మొదలుపెట్టింది. మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే సెట్లో ఎలా వుండాలో ఎలా వుండకూడదన్న విషయంలో మహేష్ నాకు స్ఫూర్తి అంటూ ఐస్ చేయడం మొదలుపెట్టింది. మహేష్ చాలా గొప్ప వ్యక్తని, ఆయన లాంటి సూపర్స్టార్తో కలిసి డ్యాన్స్ చేయడానికి మొదట్లో కొంత ఇబ్బంది పడ్డానని, భయపడ్డానని చెప్పుకొచ్చింది. అయితే పాటల్లో ఆదర్శవంతంగా కనిపించడానికి మహేష్ తనకు చాలా సపోర్ట్ చేశారని, సినిమా సెట్లో ఎలా వుండాలో, ఎలా వుండ కూడదో మహేష్ నాకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పేసింది.
దీంతో మహేష్ ఫ్యాన్స్ కొంత కూల్ అయినట్టు కనిపిస్తోంది. రష్మిక భారీ హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్గా కనిపించబోతున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన వీర జవాన్ల స్ఫూర్తితో ఈ చిత్ర కథని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
కొంత విరామం తరువాత విజయశాంతి కీలక పాత్రలో, ప్రకాష్రాజ్ విలన్గా నటిస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన గీతాలు సినిమా కథేంటో క్లూ ఇచ్చేశాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.