`ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది కన్నడ భామ రష్మిక మందన్న. గీత గోవిందం చిత్రంతో మలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్ క్రేజీ స్టార్స్ని ఆకర్షించింది. నానితో చేసిన దేవదాస్, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన `డియర్ కామ్రేడ్` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా టాలీవుడ్లో మాత్రం వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
ప్రస్తుతం వెంకీ కుడుముల రూపొందిస్తున్న `భీష్మ` చిత్రంలో నితిన్కి జోడీగా నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా వుంటే ఇదే ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలోనూ పాగా వేయబోతోంది. ఇందుకు సూర్య తమ్ముడు కార్తిని ఎంచుకుంది. `ఖైదీ` వంటి సంచలన చిత్రం తరువాత కార్తి ` సుల్తాన్` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
ఈ సినిమాతో పాటు `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న రెట్టించిన ఉత్సాహంతో వున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్నఈ సినిమా కోసం రష్మిక ఏకంగా 2 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. గతంలో లక్షల్లో మాత్రమే తీసకునే రష్మిక ఇటీవల మహేష్తో నటించిన `సరిలేరు నీకెవ్వరు` హిట్ కావడంతో పారితోషికం భారీగా పెంచేసిందని చెబుతున్నారు.