కేజీఎఫ్ పార్ట్ 1 దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో కన్నడకు మాత్రమే తెలిసిన యష్ యావత్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం సంచలనాలతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా `కేజీఎఫ్ పార్ట్ 2`రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అధీరాగా కీలక పాత్రలో బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్దత్ నటిస్తున్నారు. రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ కనిపించబోతోంది. మరో కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేష్ నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమేనని సోమవారం ట్విట్టర్ వేదికగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.
సినిమాలో రావు రమేష్ నటిస్తున్నారని, ఆయన పాత్ర ఎలా వుండబోతోందన్నది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్సీలో జరుగుతోంది. కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.