పవర్స్టార్ పవన్కల్యాణ్ `వకీల్ సాబ్` పూర్తి కాగానే వెంటనే మరో చిత్రాన్నిలైన్లో పెట్టిన విషయం తెలిసిందే. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నం. 12గా సూర్యదేరవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు స్క్రీన్ప్లే అందిస్తున్నారు.
పవన్తో కలిసి ఈ మల్టీస్టారర్ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న లాంచనంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. పవన్ పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరించారు. తాజాగా ఈ సెట్లోకి రానా దగ్గుబాటి కూడా ఎంటరయ్యారు. ఈ ఇద్దరు పాల్గొనగా ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో కీలక పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగుతుందని, ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని నిర్మాత తెలిపారు. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.