గత ఏడు నెలలుగా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు థియేటర్లు రీఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్న నిర్మాతలకు, హీరోలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరుచుకోవచ్చని ప్రకటించింది. అన్లాక్ 5లో భాగంగా కేంద్రం థియేటర్లు, మల్టీప్లెక్స్లపై తెరుచుకోవచ్చని ప్రకటించింది.
థియేటర్లు రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో స్టార్ హీరో రామ్ నటించిన `రెడ్` తొలి భార చిత్రంగా రిలీజ్ కాబోతోంది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని రూపొందించారు. నివేదా పేతురాజ్, మాళిక శర్మ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో రామ్ తొలి సారి ద్విపాత్రాభినయం చేశారు. `ఇస్మార్ట్ శంకర్` తరువాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని డిజిటల్ ఓటీటీల్లో రిలీజ్కు చాలా ఓటీటీలు ప్రయత్నించి విఫలమయ్యాయి కూడా. మొత్తానికి ఈ నెలలోనే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్కు సిద్ధమవుతోంది.
ఇదే సమయంలో వర్మ నిర్మించిన `కరోనా వైరస్` కూడా రిలీజ్ కాబోతోంది. లాక్డౌన్ టైమ్లో రూపొందించిన ఈ చిత్రం లాక్డౌన్ తరువాత విడుదలవుతున్న చిత్రంగా రికార్డు సాధించబోతోందని వర్మ అంటున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.