గోడకు బంతిని ఎంత బలంగా కొడితే అది అంతే బలంగా తిరిగి మన చెంతకే వస్తుంది. రామ్ గోపాల్ వర్మని విమర్శించినా.. పొరపాటున కదిలించినా అదే జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది కూడా. ఇప్పుడూ అదే జరుగుతోంది… మిర్యాలగూడాలో అమృత, ప్రణయ్ల ప్రేమ వివాహం, అది సహించలేని అమృత తండ్రి మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ని సుపారీ ఇచ్చి మరీ అతి దారుణంగా పట్టపగలే హత్య చేయించడం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదే సంఘటనని తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం `మర్డర్`. `కుటుంభ కథా చిత్రమ్` అని ఉపశీర్షక. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని వర్మ ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. దీనిపై అమృత స్పందించారని, ఈ పోస్టర్ చూడగానే తనకు ఆత్మ హత్య చేసుకోవాలని అనిపించిందని, వర్మ ఇంతటి నీచానికి దిగజారుతాడని ఊహించలేదని అమృత ఆవేదన వ్యక్తం చేసినట్టు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన వర్మ అదే కథతో సినిమా చేస్తున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని, అయినా ఇది యదార్థ సంఘటన ఆధారంగానే తెరకెక్కుతోందని తెలివిగా సమాధానం చెప్పారు.
తాజాగా ఈ చిత్రాన్ని అమృత, ప్రణయ్ల ప్రేమకథ ఆధారంగానే తెరకెక్కిస్తున్నట్టు ఇండైరెక్ట్గా ప్రకటించి మరిన్ని పోస్టర్స్ని ట్విట్టర్ ద్వారా వర్మ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. తండ్రి చెంపపై ముద్దు పెడుతున్న పోస్టర్ని, ఆ తరువాత తండ్రిని కన్నింగ్ గా అమృత చూస్తున్న మరో పోస్టర్ని ట్వీట్ చేసిన వర్మ దానికి `మారుతి రాసిన అమృత ప్రణయ గాథ` అని క్యాప్షన్ ఇచ్చాడు. తండ్రి ఏడుస్తుంటే అతని బుగ్గపై అమృత ముద్దు పెడుతున్న పోస్టర్ని ట్వీట్ చేసిన వర్మ దానికి `మారుతి వధించిన ప్రణయామృత గాథ` అని క్యాప్షన్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంత వివాదం అయితే అంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వర్మ ఇలా చేస్తున్నారని నెటిజన్స్, సినీ జనాలు అంటున్నారు.