సూపర్స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదపాఉ రెండ వందల కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్కు ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి హాజరై మహేష్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. వారసుడిగా ఆయనని చూసి పుత్రోత్సాహంతో సూపర్స్టార్ కృష్ణ పొంగిపోతున్నారని, ఒక తండ్రిగా తన ఆయన ఆనందాన్ని తానూ ఊహించగలనని వేదిక సాక్షిగా చెప్పడం అందరిని ఆకట్టుకుంది.
మహేష్ ఫంక్షన్కి చిరు రావడమే ఓ ఆశ్చర్యమైతే వేదికపై మహేష్ని పొగడ్తల్లో ముంచెత్తడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా చిరు కోసం మహేష్ వస్తున్నాడని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` తరువాత వెంటనే మరో కొత్త సినిమాతో సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్రెడ్డితో కలిసి హీరో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
ఇందులోని ఓ కీలక అతిథి పాత్రలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ కనిపించబోతున్నారట. సినిమాలో ఆయన పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు సాగుతుందని తెలిసింది. తాజాగా ఈ చిత్రంలో మహేష్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఇందు కోసం చరణ్ ఇప్పటికే మహేష్ని సంప్రదించాడని, మహేష్ కూడా ఈ చిత్రంలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలిసింది.