మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 27న పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ భారీ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ లెవెల్లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేసారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలను, కేక్ కటింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల్లోని మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ వేడుకలను నిర్వహించాలనుకుంటున్న వేళ రామ్ చరణ్ నుండి పిలుపొచ్చింది.
ఈసారి అసాధారణ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని, తాను కూడా చేసుకోవాలనుకోవట్లేదని రామ్ చరణ్ నుండి ప్రెస్ నోట్ వచ్చింది. నా పుట్టినరోజుని పండగలా జరపాలన్న మీ ఉద్దేశాన్ని అర్ధం చేసుకోగలను. అయితే ప్రస్తుతము ప్రభుత్వం జన సాంద్రత ఎక్కువ లేకుండా చూసుకోవాలన్న పిలుపునిచ్చిన సందర్భంగా ఈ ఏడాది వేడుకలను జరపవద్దని కోరుతున్నాను.
అలాగే మెగా ఫ్యాన్స్ ను అధికారులకు సహకరించి ప్రజలకు కరోనా యొక్క తీవ్రతను తెలియజేసి వారిలో అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంది. అదే చేస్తే దాన్నే నా పుట్టినరోజు కానుకగా భావిస్తాను అని తెలిపాడు. ఇప్పటికే మోహన్ బాబు కూడా ఈ రకమైన నిర్ణయాన్నే తీసుకున్న విషయం తెల్సిందే. మార్చ్ 19న తన పుట్టినరోజు కాగా వేడుకలను రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో నడిచాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం వల్ల షూటింగ్ ను నిలిపివేసిన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా మరో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు. ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 8, 2021న విడుదల చేయనున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ కు అంతరాయం కలగడం వల్ల ఇప్పుడు సమయానికి సినిమాను తీసుకురాగలరా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.