రోజులు గడుస్తున్నా కరోనా వైరస్ స్వైర విహారం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలని కాటేసిన ఈ వైరస్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడటం ఇండస్ట్రీ వర్గాలని షాక్కు గురిచేస్తోంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రకుల్ వెల్లడించారు. `నేను అందరికి ఓ విషయం చెప్పదలుచుకున్నాను. కోవిడ్ -19 కోసం నిర్వహించిన పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. విషయం తెలియగానే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాను. నేను బాగానే ఉన్నాను. బాగా విశ్రాంతి తీసుకుంటున్నాను. తద్వారా నేను త్వరలో షూట్కి తిరిగి రాగలను` అని రకుల్ ట్వీట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ్ హీరోగా నటిస్తున్నాడు. `కొండ పొలం` నవల ఆధారంగా అత్యంత సహజత్వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాయలసీమకు చెందిన యువతిగా రకుల్ కనిపించబోతోంది.