తమిళ సూపర్స్టార్ రజనీ మరోసారి అభిమానుల్ని ఉసూరుమనిపించాడు. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం పై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. సోమవారం `రజనీ మక్కల్ మండ్రం` జిల్లా కార్యదర్శులతో రజనీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుధీర్ఘంగా సాగిన ఈ మీటింగ్ తరువాత రజనీ సంచలన ప్రకటన చేస్తాడని అంతా భావించారు కానీ ఎప్పటిలాగే మళ్లీ నిరుత్సాహపరిచారు. భేటీ అనంతరం రజనీ రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.
తన రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటిస్తానని రజనీ చెప్పడంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రతిష్టంభన కు తెరపడలేదు. రజనీ చెప్పిన మాటలు విని ఫ్యాన్స్ తీవ్ర నిశాకు గురవుతున్నారు. `రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులు వారి తరుపు లోటు పాట్లని తెలియజేశారు. నా అభిప్రాయాలని కూడా వారితో పంచుకున్నాను. రాజకీయ ప్రవేశంపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా నిర్ణయం ప్రకటిస్తా` అన్నారు రజనీ.
రజనీ రాజకీయ అరంగేట్రం ప్రకటించిన తరువాత బీజేపీతో కలిసి నడుస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్ని రజనీ మక్కల్ మండ్రం తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. రజనీ పబ్లిక్ మీటింగ్లకు, రాజకీయ సమావేశాలకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని డాక్టర్లు ఆయనకు సూచించినట్టు గత నెలలో ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై రజనీ వివరణ కూడా ఇచ్చారు.