సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం `అన్నాత్తే`. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `సిరుతై` శివ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుండగా చిత్ర బృందంలోని కొంత మందికి కరోనా వైరస్ సోకింది.
దీంతో షూటింగ్ని అర్థాంతరంగా ఆపేశారు. అంతే కాకుండా అదే సమయంలో రజనీకి అధిక రక్తపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. రక్త పోటులో హెచ్చుతగ్గులు వున్నాయని ఆయన కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించారు. దీంతో ఆయన చెన్నైలోని తన నివాసంలో గత కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే తాజాగా `అన్నాత్తే` షూటింగ్ని చెన్నైలో ప్రారంభించారని, ఇందులో రజనీ పాల్గొంటున్నారని, ఆయన కోసం ప్రత్యేక వైద్య బృందం సెట్లో అందుబాటులో వుంటున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.