సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం `అన్నాతే`. సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూఐవీ షూటింగ్ ఎనిమిది నెలల విరామం తరువాత హైదరాబాద్లో మొదలైంది. రజనీకాంత్తో పాటు నయనతార పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. రజనీ కాంత్ ఆరోగ్య దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని బయోబబుల్ని ఏర్పాటు చేశారు.
షూటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందితో బయటి వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా బాగానే వుంది అనుకున్న సమయంలో ఏడుగురు సిబ్బందికి కోవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో విషయం తెలిసిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు. చిత్రీకరణ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాకే సెట్లోకి ప్రవేశించాలి.
ఈ నేపథ్యంలో సిబ్బంది కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఏడుగురు సిబ్బందికి కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో మిగతా సిబ్బందితో పాటు రజనీని కూడా స్వీయ నిర్భంధానికి తరలించారు. రజని ఒక వారం లేదా పది రోజుల పాటు స్వీయ నిర్భంధంలో వుంటారని తెలుస్తోంది. రజని తన రాజకీయ పార్టీని డిసెంబర్ 31 న ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందని అంతా షాక్ కు గురవుతున్నారు.