`దర్బార్` తరువాత సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం `అన్నాత్తే`. `సిరుతై` శివ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగ్లన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.
అన్ని చిత్రాల తరహాలోనే రజనీ `అన్నాత్తే` కూడా ఆగిపోయింది. అయితే ఈ చిత్రం శాశ్వతంగా ఆగిపోయిందంటూ కోలీవుడ్లో తాజాగా పుకార్లు మొదలయ్యాయి. కరోనా కేసులు తమిళనాడులో రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పట్లో షూటింగ్లు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. రజనీ కూడా వ్యక్సిన్ వస్తేనే గానీ తాను షూటింగ్లకు రాననని చెప్పడంతో ఇక ఈ మూవీ ఆగిపోయినట్టేనని కోలీవుడ్లో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారాన్ని చిత్ర బృందం కొట్టి పారేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో షూటింగ్ చేయడం యూనిట్ సభ్యులకు అంత శ్రేయస్కరం కాదని భావించి చిత్రీకరణని తాత్కాలికంగా వాయిదా వేశామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ షూటింగ్ మొదలుపెడతామని సన్ పిక్చర్స్ వర్గాలు చెబుతున్నాయి.