కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ని విధించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దేశ వ్యాప్తంగా వున్న సినీ ఇండస్ట్రీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. షూటింగ్లు ఆగిపోవడం, థియేటర్లు మూసివేయడంతో సినిమా వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నెల నుంచి షూటింగ్లకు అనుమతులు ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. శరతులుతో కూడిన అనుమతులు కావడంతో తక్కువ మంది టీమ్ తో ఇండోర్లో షూటింగ్లకు ముందు అనుమతులు ఇవ్వబోతున్నారు.
లాక్డౌన్ తరువాత ముందుగా రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి తన టీమ్కు రెడీగా వుండమని ఆదేశాలిచ్చేశారట. టీమ్ కూడా రెడీ టూ షూట్ మోడ్లో వున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన గైడ్లైన్స్కు అనుగుణంగా షూట్ని మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే రామ్చరణ్, ఎన్టీఆర్లని సిద్ధంగా వుండమని జక్కన్న చెప్పేశారట.
ట్రయల్ షూట్కి సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్తో జరిగిన ప్రత్యేక సమావేశంలో తన వాదనని బలంగా వినిపించిన రాజమౌళి ముందుగా అన్ని జాగ్రత్తలతో తానే షూటింగ్ని మొదలుపెడతానని చెప్పారట. దాంతో అంతా `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని తరువాతే చిరంజీవి `ఆచార్య`, పవన్కల్యాణ్ `వకీల్ సాబ్`, రవితేజ `క్రాక్` షూటింగ్లు మొదలు కానున్నాయి.