టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జూన్ 25, 26 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. సినీ పెద్దల వరుస మీటింగ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతిచ్చింది. దీంతో ఇటీవల చిన్న సినిమాల షూటింగ్లతో పాటు టీవీ సీరియల్స్ మొదలయ్యాయి. స్టార్ హీరోల చిత్రాల షూటింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. త్వరలోనే అవికూడా ప్రారంభం కాబోతున్నాయి.
ఇందులో భాగంగా `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కోసం రాజమౌళి డూప్లతో ట్రయల్ షూట్ చేయాలని నిర్ణయించారు. హీరోలు ఆసక్తి చూపించడం లేదని, రాజమౌళి ట్రయల్ షూట్ చేయడం లేదని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే తాజాగా రాజమౌళి గండిపేట్ సమీపంలో వేసిన భారీ సెట్లో డూప్లతో రెండు రోజుల పాటు ట్రయల్ షూట్ చేయబోతున్నారని తెలిసింది.
ఈ నెల 25, 26న జరగబోయే ట్రయల్ షూట్ కోసం యావత్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తుందట. ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాజమౌళి షూట్ చేయనున్నారట. ఈ చిత్రీకరణ సమయంలో ఎలా వుంది? ఏమైనా ఇబ్బందులు వున్నాయా?. వుంటే వాటిని ఎలా అధిగమించాలి? అని ఆలోచించి ఒరిజినల్ షూట్ని మొదలుపెడతారని తెలుస్తోంది. ట్రయల్ షూట్కి సంబంధించిన వీడియోని జక్కన్న మీడియాకు విడుదల చేస్తారట. ఇది సక్సెస్ అయితే స్టార్ హీరోల చిత్రాల షూటింగ్లు మళ్లీ యాదావిధిగా ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు.