కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైపోతోంది. ఎక్కడా షూటింగ్లు లేవు. థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్కి రెడీగా వున్న సినిమాల నిర్మాతలంతా ఎప్పుడు థియేటర్లు రీ ఓసెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. వేచి చూడలేని వారంతా ఓటీటీలకు సినిమాలు అమ్మేస్తున్నారు. ఇటీవల టీవీ సీరియల్స్ ప్రారంభమై ఓ నటుడికి కరోనా వైరస్ సోకడంతో టీవీ ఇండస్ట్రీతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా వణికిపోతోంది.
దీంతో సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడే షూటింగ్ చేయడానికి భయపడుతున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుంటే సినిమాలని నమ్ముకోవడం కంటే ఓటీటీలని నమ్ముకోవడం మంచిదని భావించిన కొంత మంది ఓటీటీలకు వెబ్ సిరీస్లు చేయడానికి ముందుకొస్తున్నారు. కొంత మంది ఏకంగా ఓటీటీలనే ఓపెన్ చేస్తున్నారు. తాజాగా నటుడు రాజా రవీంద్ర కొత్తగా ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
దీనికి కంటెంట్ కావాలని, రెడీగా కంటెంట్ వున్న వారు తమని సంప్రదించవచ్చని, వెబ్ సిరీస్ అయినా, వెబ్ ఫిల్మ్ అయినా చివరికి షార్ట్ ఫిల్మ్ అయినా కంటెంట్ కొత్తగా వుంటే చాలని తమని సంప్రదించవచ్చని ప్రకటించారు. ఆల్ జోనర్స్కి సంబంధించిన కంటెంట్ని తీసుకుంటామని, కొత్తగా వెబ్ సిరీస్ కథలు వున్నా సరే తమని సంప్రదించండని ఓ వాట్సాప్ నంబర్ని వెల్లడించారు.