శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు సౌత్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రాగిణి దివ్వేది, సంజన గల్రానీ అరెస్ట్ కావడంతో డ్రగ్స్ కేసు కొత్త మలుపులు తిరిగింది. గత కొన్నిరోజులుగా ఈ కేసులో అరెస్ట్ అయిన రాగిణి, సంజన గల్రానీ జ్యూడీషియల్ కష్టడీలో భాగంగా బెంగళూరులోని పరప్పర అగ్రహార జైలులో రిమాండ్లో వున్నారు.
అయితే తాజాగా రాగిణి ద్వివేది జైలులో గాయపడ్డారని తెలిసింది. జైలులో పడటంతో ఆమె వెన్నునొప్పికి గురైంది. బెంగళూరు సెంట్రల్ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా తాను కోలుకోలేదని రాగిణి చెబుతోంది. తాజాగా నటి రాగిణి ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందటానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
రాగిణి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని, జైలులో చికిత్స తనకు ఎలాంటి రిలీఫ్ని ఇవ్వలేదని రాగిణి న్యాయవాది ప్రత్యేక కోర్టుకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందటానికి ఆమెకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. రాగిణిని తన కుటుంబాన్ని, ఆమె న్యాయవాదిని కలవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీంతో రాగిణి డ్రగ్ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.