నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ తో ఫోటో దిగాలని భావించిన ఆర్ . శేఖర్ అనే అభిమాని వస్తూ మార్గమధ్యంలో చనిపోయాడు దాంతో లారెన్స్ తీవ్ర కలత చెందాడు . ఫోటో దిగడానికి వచ్చి చనిపోవడం ఏంటని మనసు వికలమై ఓ సంచలన నిర్ణయానికి వచ్చాడు లారెన్స్ . ఇకపై ఫోటోల కోసం నా దగ్గరకు ఎవరూ రావాల్సిన అవసరం లేదు , నేనే మీ దగ్గరకు వస్తాను అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసాడు రాఘవ లారెన్స్ . అంతేకాదు ఈనెల 7 నుండి సేలం నుండి అభిమానులను కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని తెలిపాడు .
ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అందరి మన్ననలను పొందుతున్న లారెన్స్ పలువురు చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించి వాళ్లకు పునర్జన్మ ప్రసాదించాడు . అలాగే లారెన్స్ అమ్మకు గుడి కట్టించాడు , ఇక ఇప్పుడేమో అభిమానులను కలిసి ఫోటోలు దిగడానికి వాళ్ళ దగ్గరకే వెళుతున్నాడు . లారెన్స్ నిర్ణయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేయడం ఖాయం .