పూరి మ్యూజింగ్స్ ` పేరుతో పూరి జగన్నాథ్ తనదైన పంథాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కరప్షన్పై తనదైన వెర్షన్ని వినిపించారు. మన జీవితాల్లో కరప్షన్ ఎక్కడ ఎలా మొదలైంతో వివరంగా వర్ణించారు. లంచం పుట్టుక మన ఇంటిలో మన నుండే మొదలైందని చెప్పుకొచ్చారు.
సదేళ్ల కొడుకుతో తల్లి నాన్న బజారుకెళ్లి కూరగాయలు పట్టుకురా అంటుంది. అలాగే కిరాణా షాపుకెళ్లి సరుకులు తీసుకురా అంటుంది. ఐస్ క్రీమ్కి డబ్బులిస్తే తీసుకొస్తా అంటాడు. అలాగే నాన్న అనేసి ఇచ్చేస్తుంది. మరోసారి పని చెబితే పానీ పూరీకి డబ్బులిస్తేగానీ వెళ్లను అంటాడు. వాడిని చూసి `ఏంటో వీడికి ప్రతీదానికి లంచమే` అని మురిసిపోతుంది. అదే వెధవ పెద్దయ్యాక ఏ ఆఫీసరో అవుతాడు. మనందరి దూల తీర్చేస్తాడు. తల్లినే వదలని వాడు మనల్ని వదులుతాడా. ఇలా మారాం చేసే పిల్లలతో ఈ ప్రపంచం నిండిపోయింది.
పవర్ వల్ల ఎవడైనా లంచగొండి అవుతాడు. పవర్ వుండటం తప్పుకాదు. ఆ పవర్ ఎవరి చేతిలో వుందన్నదే పాయింట్. అందుకే చిన్నప్పుడు మారాం చేసే పిల్లలందరూ పవర్ కోసం మంచి పొజిషన్ కోసం ప్రయత్నిస్తారు. మెల్లగా అలాంటి జాబ్లో చేరాక దొరికిన కాడికి కుమ్మేస్తారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనక అవినీతి వుంది. వేసే ప్రతి ఓటు వెనక లంచం వుంది. అందుకే ప్రతి ఏడాది ఎన్నికల ఖర్చు రెట్టింపవుతోంది. ఈ అవినీతిని తగ్గించేందుకు ఒక మార్గం వుంది. మార్కెట్కు వెళ్లడానికి లంచం అడిగే పిల్లల్ని ఈ రోజే అదుపు చేయండి` అన్నారు పూరి జగన్నాథ్.