తెలుగులో బయోపిక్ల శకానికి `మహానటి` చిత్రం నాందిపలికింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2018లో విడుదలై సంలచన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత తెరపైకొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు బయోపిక్ల తరువాత బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరపైకి రాబోతోందంటూ గత కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇందులో గోపీచంద్ పాత్రలో హీరో సుధీర్బాబు నటిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సుధీర్బాబు కూడా స్ఫస్టతనిచ్చారు. దీని కోసం కొన్ని నెలలు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ముంబైకి చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. కూడా. అయితే ప్రాజెక్ట్ ప్రకటించి ఇంతకాలం అవుతున్నా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటికి రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అసలు వుంటుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
గోపీచంద్ బయోపిక్ ఇంకా ప్రారంభం కాకపోవడానికి ఆసలు కారణం తాజాగా బయటికి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని చేయడానికి ముందుకొచ్చిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కి , పుల్లెల గోపీచంద్కి మధ్య ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, తను అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిరాకరిస్తోందని, ఆ కారణంగానే బయోపిక్ చర్చల దశలోనే ఆగిపోయిందని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.