మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ప్రతిరోజు పండగే`. మారుతి దర్శకత్వంలో ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు తొలి షో నుంచి మంచి టాక్తో ప్రదర్శింపబడుతూ సూపర్హిట్ టాక్ని సొంతం చేసుకుంది. కుటుంబ విలువల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అదే స్థాయిలో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో డీసెంట్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ ఫెస్టివల్ ని కూడా బాగానే సద్వినియోగం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం ఈ గురువారానికి వన్ వీక్ పూర్తి చేసుకుంది. వారం దాటినా కలెక్షన్స్ జోరులో ఏ మాత్రం తగ్గకపోవడంతో బయ్యర్లు పండగ చేసుకుంటున్నారట. 16 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం 15.33 కోట్లని రాబట్టింది. గురువారం ఒక్కరోజే 2. 80 లక్షల షేర్ని రాబట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
నైజాం ఏరియాలో 5.5 కోట్లకు బిజినెస్ అయిన ఈ చిత్రం ఇప్పటికే 6.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికి వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్లోకి రాబోతోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా `ప్రతిరోజు పండగే` హవా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రం 40 కోట్ల గ్రాస్ని వసూలు చేసినట్టు చెబుతున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఈ స్థాయి వసూళ్లని సాధించిన తొలి చిత్రం కావడం విశేషం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.