దేశంలో లాక్డౌన్ సడలించడంతో కరోనా జడలు విప్పుతోంది. లెక్కలకు అందని స్థాయిలో రోజు రోజుకీ వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంక్ష గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్పై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత 70 రోజులకు మించి సినిమా షూటింగ్లు ఆగిపోవడం, థియేటర్లు మూసివేయడంతో పలు ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ సంఘాల ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు రావడంతో వారితో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రత్యేకంగా టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు సినీ వర్గాలని కలవరానికి గురిచేస్తున్నాయి. దేశంలో కరోనా శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లని పునః ప్రారంభించే అంశాన్ని జూన్లో నమోదయ్యే కరోనా కేసులని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ భారీగా నష్టపోయిందని, అయినా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు కట్టుబడి వుండటం అభినందనీయమని పేర్కొన్నారు.
వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు నెలల వడ్డీ మాఫీ, పన్నులులతో పాటు ఇతర డిమాండ్లను మంత్రి దృష్టికి సినీ సంఘాల ప్రతినిధులు తీసుకెళ్లగా ఈ డిమాండ్లని నెరవేర్చేందుకు కేంద్రం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్ధనా మందిరాలు తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సినీ సంఘాలు థియేటర్లు గురించి ప్రస్తావిస్తే మంత్రి పై విధంగా స్పందించడం గమనార్హం.