`సాహో` తరువాత రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ చిత్రీకరణ ఇంకా కొంత బ్యాలెన్స్ వుంది. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ జార్జియాలో కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుని వచ్చింది చిత్ర బృందం. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ని వాయిదా వేశారు. తదుపరి షెడ్యూల్ని లాక్డౌన్ తరువాత పరిస్థితులని బట్టి ప్రభుత్వం ఇచ్చే అనుమతులని బట్టి ప్రారంభించే అవకాశం వుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నట్టు నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో ఊహించని విధింగా ఈ సినిమా వుంటుందిని ఇటీవల అశ్వనీదత్ వెల్లడించారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని `జగదేకవీరుడు అతిలోకసుందరి`కి సీక్వెల్గా తెరపైకి తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య పుత్రుడి కథగా ఈ సినిమా వుండబోతోందని తాజా న్యూస్. ప్రభాస్ దేవకన్య తనయుడిగా సరికొత్త పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.