`బాహుబలి` తరువాత ప్రభాస్ స్థాయి మారిపోయింది. ఇంతకు ముందు వరకు దక్షిణాదికి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ `బాహుబలి`తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. అతనితో హీమ్యాన్ తరహా చిత్రాల్ని కూడా హాలీవుడ్ స్థాయిలో నిర్మించవచ్చనే నమ్మకాన్ని కలిగించింది. దీంతో కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతీ దర్శకుడు ప్రభాస్తో పాన్ ఇండియా స్థాయిని మించి సినిమాలు రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే ఆలోచనతో పాన్ ఇండియా స్థాయికి మించి ప్రస్తుతం ప్రభాస్ తో `రాధేశ్యామ్` చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
`జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో వుంది. ఇదిలా వుంటే తాజాగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సైంటిఫిక్ చిత్రాన్ని అంగీకరించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. బాలీవుడ్ హాట్ లేడీ దీపికా పదుకునే ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్పైకి రావడానికి సన్నాహాలు జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రకటించి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు. మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్తున్నానని ప్రకించిన ప్రభాస్ అన్నట్టుగానే కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
`తన్హాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ చిత్రాన్ని చేస్తున్నారు ప్రభాస్. `ఆది పురుష్` పేరుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయం అనే థీమ్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని టి సీరస్ అధినేతలు భాషన్ కుమార్, ప్రశాంత్ కుమార్ నిర్మించనున్నారు. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో రామాయణంలో వున్న రాముడు, హనుమంతుడు, రావణాసురుడు పాత్రలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి 2022లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే చిత్రంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.