ప్రముఖ హాస్య నటుడు పొట్టి (గట్టు) వీరయ్య (75) మృతి చెందారు. చిత్ర పరిశ్రమలో పొట్టి వీరయ్యగా పేరు పొందిన ఆయన తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, కాంతారావు, ఎంజీఆర్, శివాజీ గణేషన్, రజనీకాంత్, కృష్ణ తదితర అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. వీరయ్య ఆదివారం హైదరాబాద్లో గుండెపోటుకి గురికావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పొట్టి వీరయ్య స్వస్థలం నల్లగొండ జిల్లా సూర్యపేట సమీపంలోని ఫణిగిరి. అక్కడే హెచ్.ఎస్.వి వరకు చదువుకున్నారు. నాటకాలతో అనుబంధం పెంచుకున్నారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన `అగ్గిదొర`తో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్నో జానపద చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
దాసరి నారాయణరావు రూపొందించిన `తాతా మనవడు` తరువాత సాంఘిక చిత్రాల్లో ఆయనకు పాత్రలు దక్కాయి. వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు విమల, విజయదుర్గ ఉన్నారు. విజయదుర్గ కూడా తండ్రి బాటలోనే నాటకాలు, సినిమాల్లో నటిస్తూ పేరుతెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే హైదరాబాద్లోని కృష్ణానగర్లో పొట్టి వీరయ్య ఎస్టీడీ బూత్ని నిర్వహించారు. ఆయన మృతిపట్ల సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. సోమవారం వీరయ్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.