అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రవిక్రమ్ తెరకెక్కించిన చిత్రమిది. ఇద్దు బిగ్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 80 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర కథానాయిక పూజా హెగ్డే మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
అల్లు అర్జున్తో కలిసి పూజాహేగ్డేకిది రెండవ సినిమా. గతంలో హరీష్శంకర్ దర్శకత్వంలో వచ్చిన `దువ్వాడ జగన్నాథమ్` చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. తొలి సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందట. ఇదే విషయాన్ని పూజా తాజాగా వెల్లడించింది. `మేం ఇప్పటి వరకు రెండు చిత్రాల్లో కలిసి నటించాం. దాంతో మా మధ్య సెట్స్పై కంఫర్ట్ లెవెల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అంతా అంటున్నారు అని పేర్కొంది.
ఆ కారణంగానే అల్లు అర్జున్ థ్యాంక్స్ మీట్లో నాతో మళ్లీ మళ్లీ కలిసి నటించాలని వుందని చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఇద్దరం కలిసి మరో సినిమాకు పనిచేయాలని ఆశిస్తున్నాను` అని అసలు విషయం చెప్పేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే `జాన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.