పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఎనిమిది నెలల విరామం తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాలని హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాల్ని దర్శకుడు శ్రీరామ్ వేణు చిత్రీకరిస్తున్నారు. రెడ్ కలర్ చెక్స్ షర్ట్లో పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. మాసిన గడ్డం.. గుబురు మీసంతో కనిపించిన పవన్ సెట్లో ఒక్కసారిగా మాసిన గడ్డం.. గుబురు మీసంకు బైబై చెప్పేశారు. స్మార్ట్ గా మారిపోయారు. దీంతో నిజాం కాలేజీ స్టూడెంట్స్ పవన్ని చూసేందుకు బారులు తీరారు.
తనని చూడాలని వచ్చిన స్టూడెంట్స్తో కలిసి పవన్ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత సినిమాలకు దూరమైన పవన్కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. `వకీల్సాబ్`తో పవన్ ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద హంగమా చేస్తారో చూడాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.