పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఉండొచ్చు. తనను హీరోలా కాకుండా డెమి గాడ్ లా ఫీలయ్యే ఫ్యాన్స్ తన సొంతమై ఉండొచ్చు. కానీ గత కొంత కాలంగా పవన్ వ్యవహారం నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు అజ్ఞాతవాసి చేస్తున్నప్పుడే తన సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పాడు పవన్. ఆ సినిమాలో పవన్ నటన చూస్తే ఎంత ఆసక్తితో నటించాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఏదో చేసి మమ అనేసి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. పోనిలే రాజకీయాల్లో రాణిస్తే చాల్లే అని అభిమానులు కూడా సర్దేసుకున్నారు. కానీ ఎప్పుడైతే తొలిసారి ఎన్నికల్లో పవన్ విఫలమయ్యాడో తెలుగు నిర్మాతలకు ఒక ఆశ కలిగింది. ఎలాగైనా పవన్ ను తిరిగి సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించి మొత్తానికి సక్సెస్ అయ్యారు.
దిల్ రాజు నిర్మాణంలో, బోణీ కపూర్ సమర్పణలో పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతుందని మీడియా సంస్థలకు న్యూస్ అందింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ చెప్పిన ఒక కథకు కూడా ఓకే చెప్పేసాడని న్యూస్ అందింది. ఇక అక్కడినుండి పవన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ప్రకటన వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రాజకీయ ప్రెస్ మీట్స్ లో సినిమాల్లో రీ ఎంట్రీపై చూచాయిగా స్పందించాడు. క్లారిటీగా చెప్పకపోయినా సినిమాల్లోకి వస్తున్నట్లు తన మాటల బట్టి అర్ధమైంది. అయితే ఏమైందో ఏమో గత కొన్ని రోజులుగా పవన్ వ్యవహారం మరీ విచిత్రంగా ఉంది.
ఎప్పుడూ లేనంతగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. రీ ఎంట్రీ విషయం అడుగుదామంటే అసలు నిర్మాతలకు అందుబాటులోకి రావట్లేదు. తమిళంలో బోణీ కపూర్ అజిత్ తో పింక్ రీమేక్ అవలీలగా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అదే తెలుగుకు వచ్చేసరికి అసలు ఏం జరుగుతోందో అర్ధం కాక తలపట్టుకుంటున్నాడు. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలీదు, సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడో లేదో కూడా క్లారిటీ లేదు. అసలు సినిమా ఉంటుందంటాడా లేక క్యాన్సిల్ అనేస్తాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇంతకు ముందు కూడా పవన్ వ్యవహారం ఇలాగే ఉంది. ఏఎం రత్నం నిర్మాణంలో ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టేసాక కూడా నేను చేయాలను అని సైడ్ అయిపోయాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అలాగే ఉంది. వాళ్లతో సినిమా ఎప్పుడో తేల్చలేదు. మైత్రి వాళ్ళు కూడా పవన్ ను అడగలేక తనే చేస్తాడులే అని మిన్నకుండిపోయారు. ఈ రకమైన ప్రవర్తనతో పవన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ బలంగా ఉంది.