పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఇంకా అధికారికంగా దాన్ని ప్రకటించలేదు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది. తన సన్నిహితుల వద్ద చర్చల మీద చర్చలు చేసిన తర్వాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక్కడి వరకూ బానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో మొదట ఏ సినిమాను ఎంచుకుంటాడు? దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఇప్పటిదాకా చాలా పేర్లు వినిపించినా ప్రస్తుతం రెండు పేర్లే వినిపిస్తున్నాయి.
వారే క్రిష్, దిల్ రాజు. ఒకరు దర్శకుడు, మరొకరు నిర్మాత. కాకపోతే ఇద్దరిదీ ఒక ప్రాజెక్ట్ కాదు, వేరు వేరు ప్రాజెక్టులు. క్రిష్ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఏఎం రత్నం సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు నుండే రత్నం పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి తనకు సినిమా చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక దిల్ రాజు కూడా ఎప్పటినుండో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. దిల్ రాజుది పూర్తిగా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం. అందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన దిల్ రాజు, ఒక్క పవన్ తో సినిమా తీస్తే ఒక సర్కిల్ కంప్లీట్ చేసిన భావన కోసం పవన్ తో సినిమా చేయడానికి ఎదురుచూశాడు.
పవన్ ఇప్పుడు రీ ఎంట్రీకి ఒప్పుకోవడానికి దిల్ రాజు పాత్ర చాలా కీలకం. పవన్ కళ్యాణ్ కు క్లోజ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారితో చెప్పించి తర్వాత తను కాదనలేని ఆఫర్ తో పవన్ ను కట్టిపడేసాడు. పవన్ ముందు పింక్ రీమేక్ ఆఫర్ ఉంచి కేవలం 30 రోజుల కాల్ షీట్స్ అడిగాడు. పైగా ఒకేసారి అవసరం లేదు. మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తే చాలు. ఇది పవన్ కు చాలా సౌకర్యంగా ఉంటుంది. సడెన్ గా రాజకీయంగా ఏదైనా స్పందించాల్సి వచ్చినా ఉన్న కమిట్మెంట్ కారణంగా వెళ్లలేకుండా ఉండిపోవడం, తర్వాత విమర్శల పాలవ్వడం వంటివన్నీ ఉండవు. సో, పవన్ ఎస్ చెప్పాడు. ఇక రెండో ప్రాజెక్ట్ క్రిష్ ది. జానపద నేపథ్యంలో జరిగే పీరియాడిక్ సినిమా ఇది. పింక రీమేక్ ఒప్పుకున్నాక క్రిష్ వెళ్లి ఈ సినిమా స్టోరీ చెప్పి పవన్ ను ఇంప్రెస్ చేసాడు.
అయితే ఈ రెండిట్లో ముందు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో సినిమాను లాంచ్ చేసి వచ్చే సమ్మర్ లో సినిమాను విడుదల చేసుకోవచ్చు. కాకపోతే ఈ రీమేక్ కు ఇంకా దర్శకుడు కన్ఫర్మ్ కాలేదు. దిల్ రాజు ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ ఉన్నాడు. కానీ దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ధ్రువీకరణ కావాలి. దాని తర్వాత క్రిష్ – ఏఎం రత్నం ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. దీన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రాధమికంగా అనుకుంటున్నారు. సో, వచ్చే ఏడాదంతా పవన్ బిజీగా ఉండనున్నాడు. ఇదంతా బానే ఉంది కానీ పవన్ ఈలోగా ఎక్కడ మనసు మార్చుకుంటాడోనని టెన్షన్ పడుతున్నారు దిల్ రాజు, క్రిష్.