ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్తో దూసుకుపోతోంది. కాకపోతే ఏపీలో బెనిఫిట్ షోస్ పడకపోవడం, అదనపు షో లకు అనుమతి ఇవ్వకపోవడం తో జగన్ సర్కార్ ఫై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో భీమ్లా నాయక్ సెగ మంత్రులు పేర్ని నాని , కొడాలి నాని లకు తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ థియేటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను అడ్డుకునేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపుచేశారు. జై పవన్ కల్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో పవన్ సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి వినతిపత్రం అందించేందుకు వచ్చిన తమను అరెస్ట్ చేయడమేంటని మండిపడ్డారు.