ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. దీనికిగాను హిందీ చిత్రసీమకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పద్మ పురస్కారాలు లభించాయి. పద్మ అవార్డులలో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డును బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ; టెలివిజన్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న మూవీ మేకర్ ఏక్తాకపూర్; ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్ లతో పాటు ఎన్నో ఏళ్లుగా తన పాటలతో మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్న గాయకుడు అద్నాన్ సమీ లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఇక యధావిధిగా ఈ పురస్కారాలు ప్రకటించబడిన వారికి ప్రశంసలతో పాటు ఇంకా పద్మ అవార్డులు ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించి ఉంటే బాగుండేది.? లేదా ఆ కొంతమందికి వారికి ఎందుకు ఇవ్వలేదు.? వాళ్ళకే పద్మ అవార్డులు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి.? ఇలాంటి విషయాలపై చర్చలు మొదలయ్యాయి.
ఇక శుభమా అని కొత్త సంవత్సరం డైరీ ఓపెనింగ్ సందర్భంగా, కనీస సంయమనం పాటించకుండా.. అభిప్రాయ భేదాలతో రచ్చకెక్కిన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని వాళ్లకు పద్మ అవార్డులు ప్రకటించడం లేదు. వివాదాలకు అతీతంగా తెలుగు చిత్రసీమలో పద్మ పురస్కారం అందుకునే స్థాయి ఉండి, ఇంకా రాని నటీనటులు, టెక్నీషియన్లు ఉన్నారు. ఇక ఎవరూ గుర్తించకుండా నే తమను తాము స్వయం ప్రకటిత మేధావులుగా చలామణి చేసుకుంటున్న సమాజంలోని కొంతమంది వ్యక్తులకు ఒక వారం రోజులపాటు సంబంధిత ఘటన మూలంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ పురస్కారం ప్రకటించబడిన నలుగురు తమ తమ విభాగాలలో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నవారే. సినీవినోద రంగానికి తమదైన సేవలు చేస్తున్న వారే వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.