ఒకరు మొదలు పెట్టిన చిత్రాన్ని మరొకరు సొంతం చేసుకోవడం వంటి సందర్భాలు చాలా జరిగాయి. అలా చేతులు మారిన సినిమాలు కొంత మందికి బ్లాక్ బస్టర్లని అందిస్తే మరికొంత మందికి ఫ్లాప్లని రుచి చూపించాయి. ఇక ఒక నిర్మాత మొదలు పెట్టిన సినిమాని మరో నిర్మాతలు టేకోవర్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా యంగ్ హీరో నితిన్ సినిమా కూడా చేతులు మారింది.
ప్రస్తుతం నితిన్ తన తాజా చిత్రం `భీష్మ` కోసం రోమ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రోమ్లో కీలక సన్నివేశాలతో పాటు పాటల్ని చిత్రీకరించబోతున్నారు. రొమాంటిక్ లవ్స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే నితిన్ మరో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇవి కూడా చిత్రీకరణ దశలో వున్నాయి. ఇందులో కృష్ణచైతన్య రూపొందిస్తున్న సినిమా చేస్తున్నారు.
`పవర్ పేట` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్లో నిర్మించాలనుకున్నారు. అక్కడ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాతల వద్దకు వెళ్లింది. అప్పటికే నితిన్తో `భీష్మ` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాంతో `పవర్పేట` ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఫైనల్గా వచ్చి పీపుల్ మీడియా వారి దగ్గరికి చేరింది. `భీష్మ`, రంగ్దే ప్రాజెక్ట్లు పూర్తయ్యాకే `పవర్పేట` సెట్స్పైకి వచ్చే అవకాశాలు వున్నాయని తెలిసింది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తాజా సమాచారం.