కరోనా ప్రబలడానికి ముందు యంగ్ హీరో నిఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కరోనా రోజు రోజుకీ విశ్వరూపం దాల్చడంతో నిరాడంబరంగా ఫామ్ హౌస్లో వివాహం జరిపించాలని నిఖిల్ కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. ఇరు కుటుంబాల బంధువులతో పాటు అతి కొద్ది మంది అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నిఖిల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే ఫార్ములాని యంగ్ హీరో నితిన్ ఫాలో అవుతున్నాడని తెలిసింది. షాలినితో గత కొంత కాలంగా ప్రేమలో వున్న నితిన్ ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16న అంగరంగ వైభవంగా దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని, 50 మందికి పైగా సెలబ్రిటీలని దుబాయ్ తీసుకెళ్లాలని నితిన్ కుటుంబం ప్లాన్ చేసుకుంది. కానీ కరోనా వల్ల ఆ ప్లాన్ అంతా మారిపోయింది. దీంతో ఆలోచనలో పడిన నితిన్.. నిఖిల్ తరహాలోనే సింపుల్గా వివాహం చేసుకోవాలని ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు తెలిసింది.
హైదరాబాద్లో కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లిని ఇంకా వాయిదా వేయడం కరెక్ట్ కాదని భావించిన ఇరుకుటుంబాలు సింపుల్గా వివాహం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ని పెళ్లి కోసం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ వివాహానికి అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించాలని నితిన్ నిర్ణయించుకున్నారట. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో వివాహం జరగనున్నట్టు తెలిసింది.