యువ హీరో నిఖిల్ -డా. పల్లవిల వివాహం గురువారం ఉదయం 6 గంటల 31 నిమిషాలకు హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో జరిగింది. కరోనా కారణంగా వివాహాది శుభకార్యాలు గత రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు కూడా భారీ సమూహాలకు, పబ్లిక్ ఫంక్షన్లకు, వివాహాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో శుభకార్యాలని చాలా మంది వాయిదా వేస్తూ వస్తున్నారు.
పైగా ప్రభుత్వం అనుమతినిచ్చినా అత్యంత తక్కువ మందితో మాత్రమే ఈ వేడుకలు జరుపుకోవాలని షరతులు విధించడం కూడా చాలా మంది తమ వివాహాలని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. యంగ్ హీరో నిఖిల్ కూడా కరోనా ప్రభావం వల్ల వాయిదా వేసుకున్నారు. గత కొంత కాలంగా డా. పల్లవి వర్మతో ప్రేమలో వున్న నిఖిల్ – పల్లవిలు ఈ మధ్యనే ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
ఏప్రిల్ 16న వివాహం చాలా గ్రాండ్గా జరపాలని ప్లాన్ చేశారు. కానీ రోజు రోజుకీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో సింపుల్ వెడ్డింగ్కే సిద్ధమైన నిఖిల్ తన మనసు మార్చుకుని ఈ గురువారం తెల్లవారు జామున 6 గంటల 31 నిమిషాలకు వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబాలకు చెందిన వారితో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్టు తెలిసింది.