కరోనా ఏమో గానీ టాలీవుడ్లో మాత్రం పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పెళ్లంటే.. అమ్మో పెళ్లా అంటూ ఆమడ దూరం పారిపోయిన తారలంతా ఇప్పుడు పెళ్లి పాట పడేస్తున్నారు. మంగళవాయిద్యాలు మోగిస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ వివాహం చేసుకోగా నిర్మాత దిల్ రాజు కూడా పనిలో పనిగా రెండో పెళ్లి చేసుకున్నారు. నితిన్ ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని మంచి టైమ్ కోసం ఎదురుచేస్తున్నాడు. రానా ఇటీవలే తన పెళ్లి వార్త వినిపించిన విషయం తెలిసిందే.
ఆగస్టు 8న పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు కూడా. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లతో ఇరు కుటుంబాలకు చెందిన వారంతా బిజీ బిజీగా వున్నారు. ఇదిలా వుంటే మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గత కొంత కాలంగా నిహారిక పై వరుస రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నాగబాబు నిహారిక వివాహం వచ్చే ఏడాది వుంటుందని ప్రకటించడంతో వరుడు ఎవరు? ఎక్కడి వారనే చర్చ మొదలైంది.
దీనికి ఊతమిస్తూ నిహారిక ఈ రోజు పెట్టిన పోస్ట్ సోషల్మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. నిహారికని వివాహం చేసుకోబోయే వ్యక్తి ఏపీలోని గుంటూరు వాసి అని, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత పదవుల్లో వున్న ఓ హయ్యర్ అఫీషియల్ తనయుడు అని తెలిసింది.అతని పేరు చైతన్య అని కూడా వినిపిస్తోంది. ఆగస్టులో ఎంగేజ్మెంట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేయాలని నిర్ణయించారట.