దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వున్న పలు రాష్ట్రాల్లో వారంతపు కర్ఫ్యూలతో పాటు రాత్రి పూట కర్ఫ్యూలని విధిస్తూ కోవిడ్ తీవ్రంగా వున్న రాష్ట్రలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా వుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ గడిచిన కొన్ని రోజులుగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కోవిడ్ ఉదృతి నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి మే 1 తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ని విధిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జీఓని విడుదల చేసింది. ఈ రోజు నుంచి అన్ని దుకాణాలు, హోటళ్లు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం తెలిపింది. అయితే కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్లు, మీడియా, పెట్రోల్ బంకులు, శీతల గిడ్డంగులు, గోదాములు, ఇతర అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
టిక్కెట్ వున్న రైలు, విమాన, బస్సు ప్రయాణికులకు గమ్య స్థానం చేరే సందర్భంలో లేట్ అయినా మినహాయింపునిచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. అంతర్రాష్ట్ర రవానాకు ఎలాంటి అనుమతలు అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూని ప్రకటించాయి.