కరోనా వైరస్ రోజు రోజుకీ ప్రమాద స్థాయిలో విస్తరిస్తోంది. ఎవరికి ఏ స్థాయిలో వైరస్ తీవ్రత వుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తెలియకుండానే ప్రాణాల్ని హరిస్తోందీ మహమ్మారి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు బయట అడుగుపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. కరోనా భయంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. స్టార్ హీరోలు సైతం షూటింగ్లకు రామంటూ ఇంటి పట్టునే వుంటున్నారు. యంగ్ హీరోయిన్ కూడా తాను బయటికి వచ్చేది లేదని తేల్చి చెబుతోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ కూడా తను వ్యాక్సిన్ వచ్చేంత వరకు షూటింగ్లకు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన నిధి అగర్వాల్ తను షూటింగ్స్ కి రావాలంటే వ్యాక్సిన్ రావాల్సిందే అని చెబుతోంది. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికన్ శాస్త్ర వేత్తలు చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరి కొంత కాలం ఇంటికే పరిమితం కావాలని, ఈ విలువైన సమయాన్ని తల్లిదండ్రులు, సోదరులతో గడపాలనుకుంటున్నానని నిధి అగర్వాల్ స్పష్టం చేస్తోంది. యంగ్ హీరోయిన్ జాగ్రత్త చూసి మిగతా స్టార్లు అవాక్కవుతున్నారట. అన్నట్లు నిధి అగర్వాల్ తమిళంలో `భూమి`, కన్నడలో పునీత్ రాజ్కుమార్తో కలిసి `జేమ్స్`, తెలుగులో హీరోగా పరిచయం అవుతున్న అశోక్ గల్లా చిత్రంలో నటిస్తోంది.