ఈ మధ్య ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. అదే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అన్ని భాషల్లో ఉన్న తన మ్యానేజర్లను పీకేసి రానా దగ్గుబాటికి చెందిన సెలబ్రిటీ మానేజ్మెంట్ సంస్థ క్వాన్ కు తన సినిమాల బాధ్యతను అప్పగించింది. ఇకపై అన్ని భాషల్లో రకుల్ కు సినిమాలు తెచ్చిపెట్టడం, ఫిల్మ్ మేకర్స్ కు రకుల్ కు మధ్య వారధిలా ఈ సంస్థ పనిచేస్తుంది. కార్పొరేట్ సంస్థ కావడంతో ట్రాన్స్ఫారసి ఎక్కువగా ఉంటుంది. మధ్యలో మ్యానేజర్లు రాబందుల్లా పీక్కుతినడం ఉండదు.
అటు హీరోయిన్ కు, ఇటు నిర్మాణ సంస్థకు కమ్యూనికేషన్ లేకుండా చేసి మధ్యలో మ్యానేజర్లు ఎలా అవకాశాల్ని మిస్ యూజ్ చేసుకున్నారో ఇప్పటికే మనం చాలా కథలు విన్నాం. అందుకే ఇప్పుడు సెలబ్రిటీలంతా మ్యానేజర్ల బదులు ఇలా సెలబ్రిటీ మానేజ్మెంట్ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. రెండు, మూడేళ్ళ క్రితం రకుల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అయితే వరసగా పరాజయాలు ఎదురవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. మన్మధుడు 2 తర్వాత రకుల్ కు అసలు అవకాశాలే లేవు. మరోవైపు బాలీవుడ్ లో బిజీ అవుదామని చూసినా అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో రకుల్ ఇప్పుడు క్వాన్ సహాయం తీసుకుంటోంది.
ఇప్పుడు అదే బాటలో మరో హీరోయిన్ కూడా పయనిస్తోంది. ఆమే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. నిజానికి ఈమె బాలీవుడ్ లో మున్నా మైఖేల్ అనే సినిమాతో టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఆమెకు బాలీవుడ్ లో మళ్ళీ అవకాశాలు రాలేదు. అయితే ఆమెను టాలీవుడ్ లో అక్కినేని బ్రదర్స్ ఆదరించారు. నాగ చైతన్య సరసన సవ్యసాచి, అఖిల్ సరసన mr. మజ్ను చేసింది నిధి. అయితే ఈ రెండు సినిమాలూ కూడా పరాజయం పాలవ్వడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్రను వేసేసారు. కానీ ఇంతలోనే ఆమె ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ కొట్టి ఆ ముద్రను చెరిపేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు బావ కొడుకు అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న సినిమాలో నిధి హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఈ సినిమా కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు నిధి అగర్వాల్ తమిళంలో భూమి అనే చిత్రాన్ని కూడా అంగీకరించింది. అది కూడా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే మరిన్ని అవకాశాలు అందుకోవాలని నిధి భావిస్తోంది. అందుకే ప్రస్తుతం ఉన్న మ్యానేజర్లను తీసేసి తన సినిమాల బాధ్యతను క్వాన్ కే అప్పగించింది. మరి మ్యానేజర్లను మార్చిన తర్వాత నిధి కెరీర్ ఎటు వెళ్తుందో చూడాలి.