తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. జీహెచ్ ఎంసీ పరిథిలోనే 60 శాతానికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో భాయం మొదలైంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే టెస్టులు పెరగడంతో కేసుల సంఖ్య అంత కంతకు పెరుగుతోంది.
జూన్ 21న తెలంగాణలో 730 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో జీహెచ్ ఎంసీ పరిథిలోనే 659 కేసులు నమోదు కావడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. జూన్ 22న 872 పాజిటివ్ కేసులు నమోదు కాగా జీహెచ్ ఎంసీ పరిథిలోనే 713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో వుందో అర్థమవుతోంది. రంగారెడ్డిలో 107 కేసులు నమోదయ్యాయి. ఇక మంగళవారం ఏకంగా 879 కేసులు నమోదు కాగా అందులో జీహెచ్ ఎంసీ పరిథిలోనే 652, మేడ్చల్లో 112 కేసులు నమోదు కావడం ప్రమాదకరంగా మారింది.
దీంతో హైదరాబాద్ లో నివాసముంటున్న ప్రజలు క్షణ క్షణం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. కరోనాని కట్టడి చేయాలంటే మళ్లీ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని, ఏపీ లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ ని అమలు చేస్తోందని, ఆ తరహాలో హైదరాబాద్తో పాటు కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని నెటిజన్స్ తెరాస మంత్రి కేటీఆర్తో పాటు తెలంగాణ సీఎంఓకు విజ్ఞప్తి చేస్తున్నారు.