దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ నటించనుందని, లాక్డౌన్ తరువాత ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయని ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా విజయనిర్మత తనయుడు, నటుడు నరేష్ స్పందించారు.
తన తల్లి బయోపిక్పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అసలు అమ్మపై బయోపిక్ తీయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు అన్నారు నరేష్. విజయనిర్మల బయోపిక్పై వస్తున్న వదంతులపై తాజాగా ఆయన స్పందించారు. `ఇలాంటి వార్తలు ఎలా పుట్కటుకొస్తాయో నాకు అర్థం కావడం లేదు. ఓ వ్యక్తి బయోపిక్ తీయాలంటే సంబంధిత కుటుంబ అనుమతి తీసుకోవాలన్నారు.
నేను అమ్మ బయోపిక్ కోసం కథ రాస్తున్నాను. స్క్రిప్ట్ రాయమని అమ్మే చెప్పారు. చాలా రోజుల క్రితమే రాయడం మొదలుపెట్టా. 2019లో అమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో స్క్రిప్ట్ రాయడం ఆపేశాను. అమ్మ కన్నుమూశాక స్క్రిప్ట్ రాయడం ఆపేశాను. దర్శకురాలిగా 44 సినిమాలు రూపొందించిన అమ్మ గిన్నిస్ బుక్లో స్థానాన్ని సంపాదించారు. ఆమెలో చాలా కళలున్నాయి. అమ్మ గొప్ప నటి, నిర్మాత, అలాంటి అమ్మపై బయోపిక్ అంటే చాలా పరిశోధించాలి` అన్నారు నరేష్.