కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. దీని ధాటికి సంపన్న దేశాలే అతలా కుతలం అవుతున్నాయి. కరోనాని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని నమ్ముతున్నాయి. ఇదే సరైన మందని భావించి మన దేశంలోనూ కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ని విధించారు. 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ కారణంగా చాలా వరకు వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి.
దీంతో సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయి. సినిమా షూటింగ్లు నివధికంగా వాయిదా పడ్డాయి. దీంతో సినిమా రిలీజ్ల ప్లాన్లు కూడా తారు మారయ్యాయి. కరోనా కారణంగా నేచురల్ స్టార్ నానికి సంబంధించిన `వి` సినిమా రిలీజ్ ఇప్పటికే వాయిదా పడింది. మరో సినిమా కూడా ముందు ప్రకటించిన డేట్కు రావడం లేదట.
నాని ఫిబ్రవరి 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన చిత్రం `శ్యామ్ సింగ్రాయ్`. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ముందే ప్రకటించింది. కరోనా ప్రభావం. లాక్ డౌన్ పొడిగించడం వంటి కారణాలతో ఈ చిత్ర రిలీజ్ని వచ్చే ఏడాది సమ్మర్కు పోస్ట్పోన్ చేసినట్టు తెలిసింది.