గత ఏడాది కరోనా స్వైర విహారం చేసినా ఏడాది చివరలో టాలీవుడ్లో వున్న అందరు హీరోలకు మించి బిజీ బిజీగా గడిపేశారు కింగ్ నాగార్జున. షూటింగ్లకు అనుమతులు లభించడంతో ముందుగా రంగంలోకి దిగిన కింగ్ బిగ్బాస్ సీజన్ 4 ని పట్టాలెక్కించారు. ఓ పక్క బిగ్బాస్ హోస్ట్గా వ్యవహరిస్తూనే తను నటిస్తున్న `వైల్డ్ డాగ్` షూటింగ్ని కూడా పరుగులు పెట్టించారు.
నాగ్ స్పీడు చూసి యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ లాంటి వాళ్లే ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదేమో. బిగ్బాస్ సీజన్ 4, `వైల్డ్ డాగ్` పూర్తి కావడంతో న్యూ ఇయర్ కోసం వెకేషన్ కోసం విదేశాలు వెళ్లిన నాగార్జున ఈ వారం తిరిగి ఇండియా రాబోతున్నారు. వచ్చిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్న మూవీని స్టార్ట్ చేయబోతున్నారట.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు, శరత్మరార్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. అయితే పవర్ఫుల్ పోలీస్ స్టోరీగా రానున్న ఈ మూవీ ఫైనల్ డ్రాఫ్ట్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇంత వరకు పూర్తి చేయలేదట. దీంతో నాగ్ పూర్తి డ్రాఫ్ట్ని రెడీ చేసి తన వద్దకు రమ్మని డెడ్ లైన్ విధించినట్టు తెలిసింది.