నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్లు మళ్లీ ప్రారంభించాలని చిరంజీవి అధ్యక్షతన ఇటీవల రెండు దఫాలుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ప్రత్యేక సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే.
జూన్ రెండవ వారం నుంచి షూటింగ్లకు కూడా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నట్టు మంత్రి మీడియా ముఖంగా వెల్లడించడంతో పరిశ్రమ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల జరిగిన మీటింగ్లకు తనని ఆహ్వానించలేదని, ఈ నెపంతో కొంత మంది హైదరాబాద్లో భూములు పంచుకోవాలని చూస్తున్నారని హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెను దుమారాన్ని రేపాయి.
సినిమా షూటింగ్లు మొదలుపెట్టే విషయమై సీఎం కేసీఆర్తో కలిసి సినీ పెద్దలు వరుస మీటింగ్లు నిర్వహించిన విషయం తనకు తెలియదని, తనని ఎవరూ సంప్రదించలేదని, తనని ఏ ఒక్కరూ పిలవలేదని, తలసానితో కలిసి హైదరాబాద్లో భూముల్ని పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. మిమ్మల్ని పిలవలేదని వాదించడంలో అర్థముంది కానీ భూములు పంచుకుంటున్నారని, మధ్యలో ఏదో బూతు పదం వాడారు. నోరు అదుపులో పెట్టుకోండి. మీకన్నా ఎక్కువగానే బూతులు మాట్లాడే వాళ్లు చాలా మందే వున్నారు. మీరు చేసిన ఆ వ్యాఖ్యల్ని వెనక్కుతీసుకుని క్షమాపణ చెప్పండి` అని నాగబాబు స్పష్టం చేశారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.