తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా మహమ్మారి ప్రమాద స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా అదుపులోనే వుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడి కక్కడ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెబుతున్నా చేతల్లో మాత్రం ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో జీహెచ్ ఎంసీ పరిథిలో కరోనా కట్టలు తెంచుకుంటూ సామాన్య జనాన్ని భయభ్రంతులకు గురిచేస్తోంది.
ఇదిలా వుంటే హైదరాబాద్ చుట్టుపక్కల్లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిథిలో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని సమాలోచనలు చేస్తోంది. అలా చేయడం చారిత్రక తప్పిదం అవుతుందని మెగా బ్రదర్ నాగబాబు అంటున్నారు. రెండున్నర నెలల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జనమంతా స్వచ్ఛందంగా సహకరించి లాక్డౌన్ పాటించారని, అయినా వైరస్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సంసిద్ధం కాకపోవడం విచారకరమని, ఈ లాక్డౌన్ పిరియేడ్లో సామాన్యులు తమ జీవితాల్ని కోల్పోయారని, వారి జీవితాలు ఛిన్నాభిన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి సూచనలు చేయకుండానే, వలస కార్మికుల కోసం ఏర్పాట్లు చేయకుండానే కేంద్రం హఠాత్తుగా లాక్డౌన్ విధించి వారి జీవితాలతో ఆడుకుందని ఆవేదన, ఆసహనాన్ని వ్యక్తం చేశారు నాగబాబు. లాక్డౌన్ కారణంగా జన జీవితం పూర్తిగా స్థంభించి పోయిందని, చాలా మంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయారని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మళ్లీ లాక్ డౌన్ దిశగా ప్రభుత్వాలు ఆలోచనలు చేయడం చారిత్రక తప్పిదం అవుతుందని, దీనికి తాను వ్యతిరేకమని నాగబాబు స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.