
గత కొద్ది రోజులుగా బుల్లితెర రియాలిటీ షో అయిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు తప్పు కుంటున్నారని వస్తున్న వార్తలలో నిజా నిజాలు ఏంటో తెలియక చాలామంది తర్జన భర్జన పడుతున్నారు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఇకపై జబర్దస్త్ లో తాను కనపడని అంటూ మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసిన ఒక వీడియో లో తాను వచ్చే వారం నుంచి ఇకపై ప్రతి గురువారం శుక్రవారం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలలో జడ్జి గా వ్యవహరించనని తాను కొన్ని కారణాల దృష్ట్యా తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు.
తాను జబర్దస్త్ షో నుంచి వైదొలగడం వెనకాల ఎవరి పాత్ర లేదని, తను ఇష్టపూర్వకంగానే బయటకు వచ్చానని, దీని వెనకాల ఎవరి బలవంతం లేదని, దీనిపై ఎవరూ అనవసరం అయినటువంటి వివాదాలు కాంట్రవర్సీలు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాగబాబు మాట్లాడుతూ, ఏడున్నర సంవత్సరాల క్రితం తాను వ్యక్తిగతంగా మరియు వృత్తి పరంగా కొంత స్తబ్దత లో ఉన్నప్పుడు, ఈ టీవీ మరియు మల్లెమాల వారు తనను మొదట అదుర్స్ ఆ తర్వాత జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించమని కోరారని, వాడు తన కి ఇచ్చే పారితోషికం తన స్థాయికి ఏమాత్రం తగినది కాకపోయినా, తాను స్నేహపూర్వకంగా చేస్తూ వచ్చారని చెప్పారు. ఈ టీవీ యాజమాన్యానికి మరియు మల్లెమాల సంస్థ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనకు ఎంతగానో సహకరించారని వాళ్ళను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని తెలియజేశారు.
అయితే ఏ కార్యక్రమానికైనా ఎక్కడో ఒకచోట ముగింపు ఉంటుందని తాను ముగింపు వరకు ఉండాలని కోరుకోవడం లేదని, ఆ కార్యక్రమం ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతను బయటకు రావాలని కోరుకున్నానని, అయితే గతకొద్దికాలంగా మల్లెమాల మరియు ఈటీవీ యాజమాన్యాలతో తనకు కొన్ని వ్యాపార పరమైన విభేదాలు వచ్చాయని, అందువల్లే తాను బయటకు వచ్చి వేరే కార్యక్రమాలకు వెళ్తున్నానని నాగబాబు వివరించారు.
షో లో సాంకేతిక నిపుణులు మరియు తన కో జడ్జి రోజా సెల్వమణి తో తనకు ఎటువంటి విభేదాలు లేవని వారు తనకు జీవితాంతం స్నేహితులుగా ఉంటారని నాగ బాబు స్పష్టం చేశారు. జబర్దస్త్ తోపాటు ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్స్ తరుపున ఎన్నో విజయవంతమైన షో లు డిజైన్ చేసిన సంజీవ్ కుమార్ కొన్ని విభేదాల కారణంగా జబర్దస్త్ మొదలు పెట్టిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు బయటకు వెళ్లి మాటీవీలో “మా టాకీస్” అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ కార్యక్రమం అంత విజయవంతం కాకపోయినా, అప్పుడు జబర్దస్త్ లో ఉండే యాంకర్ అనసూయ తో పాటు అనేక మంది టీం లీడర్లు బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో షోను సక్సెస్ చేసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని మెగాబ్రదర్ నాగబాబు కొత్త టీమ్ లీడర్ లను ఏర్పాటు చేసి మళ్లీ జబర్దస్త్ కు పునర్వైభవం తీసుకు వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ లు నిలబడతాయా.? లేక వాటిని డామినేట్ చేయడానికి ఇతర చానల్స్ సిద్ధం చేస్తున్ కార్యక్రమాలు నిలబడతాయా.? తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.