`అశ్వథ్థామ` వంటి యాక్షన్ సినిమాతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందించినా వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ఈ గురువారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.
`పెళ్లిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం, పెళ్లిచూపులు, కేశవ చిత్రాల తరువాత కోలీవుడ్ వెళ్లిపోయిన రీతూ వర్మ అక్కడ విక్రమ్, గౌతమ్ మీనన్ల కలయికలో రూపొందుతున్న `దృవనక్షత్రం`లో నటించింది. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల పూర్తి కాకపోవడంతో రీతూ కెరీర్ అక్కడే ఆగిపోయింది. దీంతో మళ్లీ తెలుగు బాటపట్టింది. శౌర్య సినిమాతో మళ్లీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కొత్త కథతో రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, కీలక సాంకేతిక వర్గం వివరాల్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ త్వరలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి.