పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా సినిమా అప్డేట్ అవుతోంది. అయితే సినిమా కన్నా వేగంగా డిజిటల్ ప్రపంచం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తోంది. దేశీయంగా సగటున పెరిగిన ఆడ్రాయిడ్ ఫోన్ల వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని మల్టీ నేషనల్ దిగ్గజాలు డిజిటల్ ప్రపంచం ద్వారా సగటుప్రేక్షకుడిని టార్గెట్ చేస్తూ కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్లకు తెర తీస్తున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన అమెజాన్, నెట్ఫ్లిక్స్ సంస్థలు ఇండియా వ్యాప్తంగా మేజర్ మార్కెట్ని ఆక్రమించేశాయి.
దేశీయంగా ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, ఏక్తా కపూర్కు చెందిన ఆల్ట్ బాలాజీ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ మార్కెట్ని అమెజాన్, నెట్ఫ్లిక్స్తో కలిసి పంచుకుంటున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఎంటర్టైన్మెంట్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. డిజిటల్ ఓటీటీ రంగంలోకి హాలీవుడ్ దిగ్గజం డిస్నీ కూడా ప్రవేశించబోతోంది. ఇందు కోసం వేల కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇండియాలోనే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం వుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
డిస్నీతో పాటు వరల్డ్ ఫేమస్ సంస్థ ఆపిల్ కూడా ఈ రంగంలోకి అరంగేట్రం చేయడానికి ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే యాపిల్ మొబైల్స్లో ఆపిల్ టీవి యాప్ని ఇన్ బిల్ట్గా అందజేస్తున్న ఆపిల్ సంస్థ తన యూజక్స్కి ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా హాలీవుడ్ చిత్రాల నుంచి స్థానిక చిత్రాల్ని కూడా అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. దీని నుంచి తట్టుకోవడం కోసం తెలుగు నిర్మాతలు డి. సురేష్బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు.. ఇలా పేరున్న నిర్మాతలంతా కలిసి మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీని కోసం ఓ టీమ్ నిరంతరం పనిచేస్తోంది. ఇదే తరహాలో ఓ మల్టీనేషనల్ కంపెనీ డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది. దీని కోసం పవర్స్టార్ పవన్కల్యాణ్ ఇమేజ్ని వాడుకుని మెగా హీరోలతో వెబ్ సిరీస్లు ప్లాన్ చేయబోతోందని, ఇందు కోసం పవన్కు గుడ్ విల్ కింద 500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.